Home » 2009 elections | 2009 Parliament Elections | Andhra | andhra politics | andhra pradesh | Andhra-Telangana | Business | Chiranjeevi | Close To Reality | education | GHMC elections | Google | Headline | India | Indian Politics | international politics | Rayalaseema | Technology | Telangana

వెనుకబడ్డ జాతికి చరమ గీతం!

16. January 2011 by viswamitra 1 Comments
  
ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో తెలుగుజాతి ఒకటి. ఒక ప్రాంతాన్ని బట్టో, లేక ఒక కులాన్ని బట్టో ఈ మాట అనడం లేదు. బతుకు, బతికించు, సగర్వంగా జీవించు అనే విషయంలో మనం ఎప్పుడూ వెనుకనే. మన సంఘంలో, ప్రత్యేకించి ఈ గొడవల సమయంలో నిన్న, రేపుని పక్కనబెడితే ఈ రోజు ఆర్ధికంగా, సామాజికంగా ఉన్న జరుగుబాటునే మన వాళ్ళు అభివృద్ధి, ఆత్మగౌరవం అంటున్నారు.
 
ఎక్కడికి పోయింది వీళ్ళ ప్రతాపం?
 
ఎవరు అవునన్నా కాదన్నా, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, పార్టీని బట్టి కాక మన భారతంలో మన భవిష్యత్తు నిర్ణయించేది డబ్బు. ఇక్కడ ఒక సూటి ప్రశ్న! అణచివేయబడ్డామన్న తెలంగాణా వాళ్ళ మధనం, పట్టుదల మన జాతిని మార్చలేక పోయాయి. నాగరికులం, కష్టపడే వాళ్ళమన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా మన జాతి ఆర్ధిక పరిస్థితిని పెద్దగా మార్చలేక పోయారు. అధికారంలో ఉండడంకూడా అంతంత మాత్రమే.
తెలంగాణాలో స్థానికుల పెట్టుబడి తక్కువే... చేవ ఉన్నవాడికి గుర్తింపు తక్కువే, చేసిన పనికి ప్రతిఫలం కూడా తక్కువగానే ఇస్తారు.  పెట్టుబడి దారులు అని ముద్ర పడ్డ ఆంద్ర ప్రాంత వ్యాపారవేత్తల తెలివితేటలూ కుటుంబ అభివృద్ధికే పరిమితం - ఎందుకంటే వాళ్ళు స్థిరంగానే ఉపాధి  కల్పిస్తారు కానీ గజ ఈతగాడికి,  గుంతలో ఈతనేర్చుకునే వాడికీ ఒకే జీతం ఇస్తారు. వాణ్ణి చావనివ్వారు, బ్రతకనివ్వారు, ఎదగనివ్వరు... వాళ్ళు కూడా ఒక పరిధిని మించి ఎదగరు! ఇక ఎక్కడో ఉత్తాంధ్ర వారో  లేదా రాయలసీమ వాళ్ళో అయితే వ్యాపార సామ్రాజ్యాన్ని లేకపోతె అధికార కేంద్రాన్నో సొంతం చేసుకుంటారు. (అందరూ కాకపోయినా, చాలావరకి ఇంతే)
  
అసలు ఒక రకంగా చుస్తే, ఆంద్రప్రదేశ్ అంటే చాల మందికి ఇవాళ రేపు  ఒక ఆంధ్ర గానో, తెలంగాణా లాగానో మాత్రమే తెలుసు. తెలుగేతరుల దృష్టిలో ఈ ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు ఈ గొడవల్లో చాలావరకి తటస్తం గానే  ఉన్నారు. 
 
తేడా ఎక్కడ ఉంది?
 
వీళ్ళ దృష్టి ఎక్కడ అంతమవుతుందో వాళ్ళ ద్రుష్టి అక్కడ మొదలవుతుంది!  నన్ను ఉద్దరించు, నువ్వు బాగుపడు... లిమిట్స్, లెక్కలు వర్తించవు. నీకు దమ్ముంటే చాలు. ఇది  వాళ్ళకి తెలిసిన వ్యాపార నీతి. సునిశితంగా ఆలోచిస్తే ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా పాతుకు పోయిన అలవాట్లు, ద్రుక్పదాలే దీనికి కారణం. ఒక ప్రధాన కారణం వారు అధికార కేంద్రాలకి దగ్గరగా ఉండడం... అప్పట్లో అధికారం నిరంకుశంగా కాక సత్తా ఉన్న వాళ్ళని దేశ విదేశాల నుంచి రప్పించే విధంగా ఉండడం, కొలువులివ్వడం ... ఆం.ప్ర. కి ఉత్తరాన ఉన్న విజయనగరం నుంచి పడమర నున్న రాయల విజయనగరం, గత కొన్నేళ్ళ క్రితం అధికార కేంద్రం గా  ఉన్న చెన్నపట్నం వరకు ఇదే వర్తిస్తుంది.
 
ఇక్కడ నవాబులు ప్రజలకి సొంతగా ఆలోచించే సుహ్రుద్బవ వాతావరణాన్ని చాల వారకి కల్పించక పోగా, ప్రజలని పీల్చి పిప్పిచేసి ఆభరణాలు, హంగులతో కులికారు. (మనం వాటినే సాలార్జంగ్ మ్యూసియం వరకు వెళ్లి కళ్ళు పెద్దవి చేసుకొని  చూసి కీర్తించి వస్తుంటాము!) ఇవాళ బిర్యాని ఉంటె చాలన్నదగ్గరి చూపునుంచి తెలంగాణా ఇప్పుడిపుడే  కోలుకొని కొంత పెట్టుబడుల దిశగా వెళ్తుంది. భారత దేశం మార్కెట్ దమ్ము ఏంటో ప్రపంచ మంతా గుర్తించింది కాని మన ఆంధ్ర వ్యాపార వేత్తలు గుర్తించలేరు. వీళ్ళు భవిష్యత్తు ఉన్న విషయాలని చూడగలరు. అర్థం చేసుకోగలరు. ఆరంభించగలరు. అభివృద్ధి చేయగలరు. కానీ ఎవడైనా అదే రంగంలో వాళ్ళని మించిన వేగంతో వెళ్తుంటే తట్టుకోలేరు. వాడిని తొక్కి పట్టడానికి ఇచ్చిన సమయం వీడి గీత పెద్దది చేసుకోడానికి ఇవ్వరు. అందుకే ఒక కుటుంబ వ్యాపారం లాగా దాని కథ ముగుస్తుంది. ఒకటి రెండు తరాలు వాళ్ళ వారసుల దయదక్షిన్యాల మీద అది నడుస్తుంది.
 
బీడు భూములు, దుర్భిక్షం ఎక్కువగ ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి చూసి జాలి  పడ్డా , వారి కార్య సాధన... మేనేజ్మెంట్ సూత్రాలకి మాత్రం ఆశర్యపోవాలి. గల గల పారే పెద్ద కాలువలు మాకు కూడా కావాలి అనుకున్నారు రాజశేఖర్ రెడ్డి. దాని ఫలితం పోతిరెడ్డిపాడు!  జయించు/ దొంగిలించు, అనుభవించు, పంచు, ప్రోత్సహించు  లాంటి రాబిన్ హుడ్  సిద్ధాంతాన్ని అలవాటుగా అందించిన రాయల పరిపాలనని పోజిటివ్ గా ఉపయోగించుకున్న వాళ్ళు నాయకులయ్యారు, దేశ దేశాల్లో పేరొందిన వ్యాపారులయ్యారు. దాన్ని నెగెటివ్ గా తీసుకున్న వారు "గాలికి" కి కొట్టుకు పోతున్నారు.
 
 అమెరికా లాడెన్ ని పెంచి పోషిస్తే ఏమయింది? పటేల్, పట్వారి, దొరలు, ప్రాభవం కోల్పోయిన కాకతీయ ప్రభువుల వారసులు  తమ భూములు కాపాడుకోడానికి కొంగ్రెస్ కి భజన చేసి, వేర్లు, పిల్ల వేర్ల తో సహా పెంచి సుస్థిర పరచారు. ఎన్టీర్ దాన్ని కూకటి వేళ్ళ తో సహా పెకలించి ఎవడు దొర, ఎవడికి దొర అని ప్రశ్నించి... దున్నే వాడిదే భూమి అని చెప్పి  గౌడలు,  గొల్లలు, సాలెలు, తదితర వ్రుత్తి వారందరికి అధికారాన్ని పంచారు. (ఇప్పుడు చిరంజీవి చెప్ప్పే మార్పు కలలు... మెరుపు కలలు ఇవే!). ఆయన పోయాక నిరంకుశత్వం మళ్ళీ పెరిగింది... పార్టీ ఏదైనా అధికారం రుచి చూసిన నిమ్నవర్గాలు నేటికీ తమకు సమ న్యాయం కావాలని పోరాడుతూనే ఉన్నాయి.
 
ఒక ప్రాంతంపై పట్టుకోసం ఇప్పటి కొంగ్రెస్ కూడా అదే డివైడ్ అండ్ రూల్ పధ్ధతి ప్రకారం YS కుటుంబానికి పెద్ద పీట వేసింది. KCR ని వాడుకుంటుంది. జగన్ పాఠం నేర్పారు. తెలంగాణా సెంటిమెంట్ తో ఆడుకుంటే ఇక్కడి వాళ్ళూ అదే చేస్తారు. కానీ దురదృష్టం ఏమిటంటే కెసిఆర్, నాగం, కోదండ రామ్, గద్దర్ వీళ్ళెవ్వరూ తెలంగాణా లో అధిక భాగం ఉన్న వ్రుత్తి పని వాళ్లకి అధికారాన్ని ఇవ్వలేరు. ఎన్టీఅర్ లాంటి "సొంత" చరిష్మ ఉన్న నాయకుడు మళ్ళీ పుట్టల్సిందే!  
 
NTR  మరణించారు :  
 
కులం, వర్గం  ఆధారంగా వేర్పాటు రాజకీయాలు;ప్రాంతం ప్రాతిపదికన రాజకీయాలు క్రమంగా అంతరించి పోయే పరిస్థితిని అణచివేత ద్వారా కాకుండా అధికారంలో ప్రాధాన్యత కల్పించి NTR విజయం సాధించారు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటనే ఒక స్పృహని సామాన్యుల్లో తీసుకొచ్చారు. తెలుగు దేశం చంద్రబాబు హయంలో  మళ్ళీ రెండవ సరి అధికారంలోకి వచ్చాక ఈ గ్రూపులు, నిరంకుశత్వం వంటివి రెండవ శ్రేణి నాయకుల్లో ప్రబలంగా కనిపించాయి. ఇది కాంగ్రెస్ సంస్కృతికి ఏమాత్రం విరుద్ధం కాదు.
 
మన చతుర్వర్ణ వ్యవస్థ ఎప్పుడో కుప్ప కూలినా  దాని మూలాలు, వికృత రూపాలు జీవం పోసుకొని, ఎప్పుడైతే మళ్ళీ పాలక వర్గాలకే ప్రాధాన్యం, కులం ప్రాతిపదికన, ప్రాంతం ప్రాతిపదికన ప్రాధాన్యం తో రాజకీయాలు ఊపందుకున్నాయో అప్పుడే అయన స్పూర్తి చచ్చిపోయింది. 
 ఇప్పుడు మేము కమ్మ,  రెడ్డి, మేము వెలమ, నాయుడు అని చెప్పుకునే వళ్ళంతా ఆ వ్యవస్థలో శూద్రులే (వర్కింగ్ క్లాస్). యోధులు/పాలకులు, బ్రహ్మత్వం తెలిసినవారు, వాణిజ్యంలో నేర్పరులైన వైశ్యులు కాక నాల్గవ వర్ణంలోకే (వ్యవసాయం, జమిందారీ,  గీత, నేత, రజక... అంతా) వస్తారని ఈ కులం... ప్రాంతం అని తిరిగే ఈ గజ్జి నాయకులు, పిచ్చి నాయకులు రేపు వీళ్ళ ఇంటి పేరుతొ ఒక ప్రాంతం  కావాలన్నా ఆశ్చర్యం లేదు. ఇంత మంది చే పరిపాలించ బడ్డ భారతావని లో మేము ఈ కులం/వర్గం పూర్వికుల వల్లే పుట్టాము అని ఆధారాలతో సహా చెప్పగల వారెంతమంది?  
 
మున్న ఆంగ్లేయుడు, నిన్న నవాబు, నేడు దొర/పటేల్/కమ్మోడు, రేపు ఇంకొకడు... మన ప్రజలకి స్వయంపాలన అంటే ఇంతే.  తెలివి వచ్చే లోపు హైదరాబాద్ ఎగిరి పోయి కేంద్రంలో కలుస్తుంది. ఇప్పటికే రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ లని కేంద్రం డివైడ్ అండ్ రూల్ పాలసీ (ప్రాంతం అభివృద్ధి) కింద కొనేసింది. కులం, వర్గ్రం పాలసీ కింద కొంత మందికి బేరం పెట్టింది. కానీ ఇది సామజిక వెనుకబాటుని తొక్కి పట్టే ఒక భయంకరమైన క్రీడ... ఏళ్ళ తరబడి నడుస్తున్న చరిత్ర.  ప్రత్యెక తెలంగాణా అంశం ఒక ప్రాంతీయ వెనుకబాటు నుంచి పుట్టింది కాదు... అది ఒక సామజిక వెనుక బాటుని ఇలా రక రకాల బేర సారాలతో నిర్లక్ష్యం చెయ్యడం వాళ్ళ మన ప్రజల్లో రగులుతున్న నిర్వేదం.  ఇందిర, చెన్నారెడ్డి, గవర్నర్లు, సోకాల్డ్ కమ్యునిష్టులు, చందాలు వసూలు చేసే నాయకులు, కళాకారులు,  కెసిఆర్, సోనియా, చంద్రబాబు... ఇలా పాత్రలేవైనా ఆడే గేమ్ ఒక్కటే.
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (1) -

sivaskarumuri@gmail.com
India sivaskarumuri@gmail.com said:

Bagane chepparu, kani ee manushullo marpu raadu

Comments are closed